Nexon EV | టాటా మోటార్స్ పాపులర్ ఎస్యూవీ ఎలక్ట్రిక్ కారు `నెక్సాన్ ఈవీ`బేస్ మోడల్ ధర తగ్గింది. ఇంతకుముందు రూ.14.99 లక్షలు పలికిన నెక్సాన్ ఈవీ ఇప్పుడు రూ.14.49 లక్షలకే అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర మాత్రం రూ.16.49 లక్షలు. నెక్సాన్ ఈవీ మార్కెట్లోకి ఆవిష్కరించి మూడేండ్లయిన సందర్భంగా టాటా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకున్నది. మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 400 కారు ధర రూ.15.99 లక్షల నుంచి రూ.18.99 లక్షలు ఉంటుందని ప్రకటించాకే టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవీ ధర తగ్గించడం గమనార్హం.
అంతేకాదు ఎక్స్యూవీ400 ఈవీ ప్రస్తుత ధరలు తొలి 5000 మంది కస్టమర్లకే వర్తిస్తాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. టాటా నెక్సాన్ ఈవీతో మార్కెట్లో సరిజోడీగా పోటీ పడనున్నది ఎక్స్యూవీ 400 ఈవీ. ఒకసారి చార్జింగ్ పూర్తి చేస్తే మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీ కారు 456 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
నెక్సాన్ ఈవీ రెండు వేరియంట్లు (ప్రైమ్, మ్యాక్స్), డిఫరెంట్ చార్జింగ్ ఆప్షన్లతో వస్తున్నది. ఈవీ ప్రైమ్ నెక్సాన్ కారు (బేస్ మోడల్) రూ.14.49 లక్షలకు లభిస్తుంది. హయ్యర్ వర్షన్ నెక్సాన్ ఈవీ మాక్స్ రూ.16.49 లక్షల నుంచి మొదలవుతుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్ఎం కారు డెలివరీ వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నది. అంతే కాదు టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కారు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 453 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇంతకుముందు విడుదల చేసిన నెక్సాన్ ఈవీ 437 కి.మీ దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. పాత మోడల్ నెక్సాన్ ఈవీ కార్ల యజమానులు కారు ప్రయాణ సామర్థ్యం పెంచుకోవాలంటే మాత్రం సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాల్సిందే.