Tata Motors | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూకుడుగా దూసుకెళ్తున్న టాటా మోటార్స్.. ఆ దిశగా స్పీడ్ పెంచుతోంది. మున్ముందు పెట్రోల్ ఆధారిత టెక్నాలజీ కార్లపై ఆధార పడటం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సమీప భవిష్యత్లో పెట్రోల్ కార్ల కంటే.. సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లను మార్కెట్లోకి తేవాలని సంకల్పించింది. కనీసం మూడొంతుల కార్లు సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లాలని భావిస్తున్నది.
ప్రస్తుతం కార్ల మార్కెట్లో సీఎన్జీ గ్యాస్ వేరియంట్ల వాటా 8 శాతం, ఎలక్ట్రిక్ కార్ల వాటా తొమ్మిది శాతం. వచ్చే మూడు, నాలుగేండ్లలో 15 శాతానికి పెంచుకోవాలని టాటా మోటార్స్ సంకల్పించింది. అందులో భాగంగా వచ్చే ఏడాది.. అంటే 2024లో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
2030 నాటికి దేశీయ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు 35 నుంచి 40 శాతం ఉంటాయని గతేడాది డిసెంబర్లో బెయిన్ అండ్ కో నివేదిక అంచనా వేసింది. సగటున ప్రతి ఏడాది దాదాపు 1.6 కోట్ల కొత్త ఈవీ కార్లు అమ్ముడవుతాయని అంచనా వేసింది. ఇందులో భాగంగానే గత మార్చిలో టాటా మోటార్స్.. ప్రత్యేకంగా ఈవీ కార్ల షోరూమ్ ప్రారంభించింది.
ఫ్యుయల్ వసతులు మెరుగవ్వడం, ఆపరేషనల్ వ్యయం తగ్గడంతో సీఎన్జీ కార్లకు గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్, టాటా మోటార్స్.. కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) వేరియంట్ కార్ల సేల్స్ పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ప్రభుత్వ రంగ వెబ్ సైట్ ‘వాహన్’ లెక్కల ప్రకారం గత మార్చిలో సీఎన్జీ వేరియంట్ కార్లు 30 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021 మార్చితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. గత నెలలో అత్యధికంగా టాటా మోటార్స్ 6,516 ఈవీ కార్లు విక్రయించింది.
కస్టమర్లు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఆప్షన్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. కాస్ట్ తగ్గింపుతోపాటు పర్యావరణ హితం కావడం దీనికి కారణం అని తెలిపారు. తేలిగ్గా లభించడంతోపాటు సీఎన్జీ వేరియంట్ కార్లు పాపులారిటీ సంపాదించుకున్నాయన్నారు.