Tata Motors | గతంతో పోలిస్తే కార్ల తయారీలో టాటా మోటార్స్ దూకుడుగా ముందుకెళ్తున్నది. సంప్రదాయ మోడల్ కార్లలో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా పోటీ పడుతుంటే.. ఎలక్ట్రిక్ కార్ల తయారీతోపాటు సేల్స్లోనూ టాటా మోటార్స్దే హవా..
టైగోర్ ఈవీ, టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ కార్లు ప్రధానంగా అమ్ముడవుతున్నాయి. ఐదేండ్ల క్రితం ఎలక్ట్రిక్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన టాటా మోటార్స్ అరుదైన మైలురాయిని చేరుకున్నది. ఈ నెల 11 నాటికి లక్ష ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది.\
తొలుత దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ తన నెక్సాన్ ఈవీని ఆవిష్కరించింది. నాటి నుంచి ఇప్పటి వరకూ టాటా మోటార్స్ ఈవీ కార్లలోనూ నెక్సాన్ ఈవీ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. లక్ష ఈవీ కార్లలో తొలి పది వేల కార్ల విక్రయానికి 44 నెలలు పడితే.. మిగతా 40 వేల కార్ల విక్రయానికి కేవలం 15 నెలలు.. మరో 50 వేల కార్ల విక్రయానికి తొమ్మిది నెలల టైం మాత్రమే పట్టింది.
టాటా నెక్సాన్ ఈవీ అత్యంత చౌకగా రూ.14.49 లక్షలకు అందుబాటులో ఉంది. టియాగో ఈవీ రూ.8.69 లక్షల నుంచి రూ.12.04 లక్షలు (ఎక్స్ షోరూమ్), టైగోర్ ఈవీ రూ.12.49-13.75 లక్షలు (ఎక్స్ షోరూమ్), నెక్సాన్ ఈవీలో రెండు వర్షన్ కార్లను విక్రయిస్తున్నది. వాటిల్లో నెక్సాన్ ఈవీ ప్రైమ్ రూ.14.49-17.19 లక్షలు, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రూ.16.49-19.54 లక్షల (ఎక్స్ షోరూమ్) లభిస్తుంది.