Tata Tech IPO | టాటా సన్స్ గ్రూప్కు చెందిన రెండు అనుబంధ సంస్థలు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వెళ్లనున్నాయి టాటా మోటార్స్ అనుబంధ డిజిటల్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ టాటా టెక్నాలజీస్ త్వరలో ఐపీవోకు వెళ్లనున్నదని ఆ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమ భవిష్యత్ అవసరాల కోసం నిధులు సమీకరించడానికి టాటా టెక్నాలజీస్.. ఐపీవోకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇంతకుముందు 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐపీవోకు వెళ్లింది. ఆ తర్వాత టాటా సన్స్ అనుబంధ సంస్థ ఐపీవోకు వెళితే 18 ఏండ్ల తర్వాత తొలిసారి అవుతుందని పరిశ్రమ వర్గాల కథనం. టాటా టెక్నాలజీస్.. తన ఐపీవో వ్యవహారాలను చక్కబెట్టేందుకు సిటీ గ్రూప్ను నియమించుకున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించడానికి టాటా టెక్నాలజీస్ గానీ, సిటీ గ్రూప్గానీ నిరాకరించాయి.
టాటా టెక్నాలజీస్లో టాటా మోటార్స్కు 72.48 శాతం వాటా ఉంది. ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 8.96, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 4.48 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇంకా టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా ఎంటర్ ప్రైజెస్ ఓవర్సీస్, జెడ్రా కార్పొరేట్ సర్వీసెస్, ప్యాట్రిక్ రేమాన్ మైక్గోల్డ్రిక్ ఇన్వెస్టర్లుగా ఉన్నాయి.
టాటా సన్స్ మరో అనుబంధ సంస్థ టాటా స్కై కూడా ఐపీవో సన్నాహాల్లో ఉందని సమాచారం. టాటా గ్రూప్ శాటిలైట్ టెలివిజన్ బిజినెస్ అంతా టాటా స్కై ఆధ్వర్యంలోనే సాగుతున్నది. అయితే ఐపీవోకు అనుమతి ఇవ్వాలని సెబీ ముందు ఇప్పటికైతే టాటా స్కై డ్రాఫ్ట్ దాఖలు చేయలేదు. అయితే, తొలిసారి 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐపీవో ద్వారా రూ.5,500 కోట్ల నిధులు సేకరించింది.