Tata Motors | దేశీయంగా ఇప్పటి వరకు కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి తర్వాత దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్దే.. కానీ గత నెలలో దేశీయ ఆటో మేజర్ టాటా మోటార్స్ .. ప్రయాణికుల కార్ల సేల్స్లో హ్యుండాయ్ను పక్కకు నెట్టేసి రెండో స్థానాన్ని ఆక్రమించుకున్నది. గత దశాబ్దిలో ఇదే తొలిసారి. హ్యుండాయ్ను టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్యూవీ మోడల్ కారు దాటేసింది. 2021లోనే గత నెలలో టాటా మోటార్స్ అత్యధిక కార్లు విక్రయించింది. అంతే కాదు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం మధ్య కూడా అత్యధిక యూనిట్లు అమ్ముడయ్యాయి.
డిసెంబర్ నెలలో టాటా మోటార్స్ 35,300 కార్లు విక్రయిస్తే, హ్యుండాయ్ మోటార్ ఇండియా 32,312 యూనిట్లు విక్రయించింది. టాటా మోటార్స్ 2021 మూడో త్రైమాసికంలో 3,31,178 కార్ల విక్రయాలు జరిగితే 99,002 కార్లను పంపిణీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో టాటా మోటార్స్ పలు మైలురాళ్లను నమోదు చేసిందని సంస్థ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేశ్ చంద్ర చెప్పారు.
కార్ల విక్రయాల్లో 2020 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 50 శాతం వృద్ధి సాధించింది టాటా మోటార్స్. అక్టోబర్లో టాటా మోటార్స్ విపణిలో ఆవిష్కరించిన టాటా పంచ్ మోడల్ కారుకు భారీ డిమాండ్ వచ్చిందని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల సేల్స్లోనూ టాటా మోటార్స్ రికార్డులు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం ఎలక్ట్రిక్ కార్లు విక్రయిస్తే, ఈ ఏడాది 5.6 శాతానికి చేరాయి.
హ్యుండాయ్ మోటార్ ఇండియా గతేడాది అంతా సెమీ కండక్టర్ల కొరతను ఎదుర్కొన్నది. కొన్ని నెలలుగా విడి భాగాల కొరతతో కార్ల ఉత్పత్తిలో కోత విధించడంతోపాటు నో ప్రొడక్షన్ డేస్ కూడా ప్రకటించింది. 2020తో పోలిస్తే 2021లో 19.2 శాతం వృద్ధి సాధించిందని హ్యుండాయ్ మోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు.