న్యూఢిల్లీ, జనవరి 25: టాటా మోటర్స్ భారీ లాభాలను అందుకున్నది. రెండేండ్ల తర్వాత మళ్లీ ఈ దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్ లేదా క్యూ3)గాను రూ.3,043 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని బుధవారం టాటా మోటర్స్ ప్రకటించింది. వాహన అమ్మకాలు పెద్ద ఎత్తున పుంజుకోవడమే ఇందుకు కారణమని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే త్రైమాసికంలో రూ.1,4 51 కోట్ల నికర నష్టాన్ని సంస్థ పొందినది. తెలిసిందే. కాగా, సంస్థ మొత్తం ఆదాయం గతంతో చూస్తే రూ.88,489 కోట్లకు ఎగబాకింది. క్రిందటిసారి రూ.72,229 కోట్లుగానే ఉన్నది. ఇదిలావుంటే స్టాండలోన్ ఆధారంగా టాటా మోటర్స్ నికర లాభం ఈసారి రూ.506 కోట్లుగా నమోదైంది. ఇక సంస్థ లగ్జరీ వాహన విభాగం జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) రెవిన్యూ 6 బిలియన్ పౌండ్లు ఎగబాకి గతంతో పోల్చితే 28 శాతం వృద్ధిని కనబర్చింది. మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టుగా పెరిగిన వాహనాల సరఫరా, ఆకర్షణీయ మోడల్స్, ధరలు కలిసొచ్చాయని ఈ సందర్భంగా టాటా మోటర్స్ తెలియజేసింది.