Tata on Bislery | ప్రతి ఒక్కరికీ ఆహారం, తాగునీరు తప్పనిసరి.. కాలుష్యం ప్రభావం పెరిగినా కొద్దీ సురక్షిత తాగునీటి అవసరం పెరిగింది. తాగునీటి రంగంలోకి కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించాయి. భారత్లోకెల్లా అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ బిస్లరీ ఇంటర్నేషనల్లో వాటా కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ ఆఫర్ ప్రకటించింది. బిస్లరీని టేకోవర్ చేయడానికి టాటా గ్రూప్ నుంచి ఆఫర్ వచ్చిందని బిస్లరీ సంస్థకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్లు చెప్పారు. వాటర్ బిజినెస్లోకి ఎంటర్ కావడానికి టాటా గ్రూప్ ఆసక్తిగా ఉందన్నారు. బిస్లరీ ఇంటర్నేషనల్కు రమేశ్ చౌహాన్ సారధ్యం వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఎంట్రీ లెవెల్, మిడ్ సెగ్మెంట్, ప్రీమియం ప్యాకేజ్డ్ వాటర్ క్యాటగిరీల నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లకు సరఫరాకు సరిపడా నెట్వర్క్ కలిగి ఉన్నందున బిస్లరీని టేకోవర్ చేయగలిగితే టాటా గ్రూప్కు ఈ రంగంలో పట్టు లభిస్తుందని బిస్లరీ, టాటా సంస్థల ప్రతినిధులు అంటున్నారు. కెమిస్ట్ చానెల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలతోపాటు ఇన్స్టిట్యూషనల్ చానెల్స్కు బిస్లరీ మినరల్ వాటర్ సరఫరా అవుతుంది.
టాటా గ్రూప్ అనుబంధ టాటా కన్జూమర్ బిజినెస్ సంస్థ.. స్టార్బక్స్ కేఫెల నిర్వహణతోపాటు టెట్లీ టీ, 8`0 క్లాక్ కాఫీ, ఉప్పు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు విక్రయిస్తున్నది. ఈ రంగాల్లో వ్యూహాత్మకంగా సంస్థలను టేకోవర్ చేయడానికి గల అవకాశాలను చురుగ్గా పరిశీలిస్తుందని టాటా కన్జూమర్ సీఈవో సునీల్ డిసౌజా ఇటీవల చెప్పారు.
ఇప్పటికే నౌరిష్ కో బ్రాండ్ కింద టాటా కన్జూమర్ సొంత బాటిల్డ్ వాటర్ బిజినెస్ కలిగి ఉంది. దేశవ్యాప్తంగా బిస్లరీ ఇంటర్నేషనల్కు 150 మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు, 4000కి పైగా డిస్ట్రిబ్యూటర్లు, 5000 ట్రక్కులు ఉన్నాయి.అయితే, బిస్లరీ ఇంటర్నేషనల్ టేకోవర్ చర్చలపై స్పందించడానికి టాటా కన్జూమర్ స్పందించడానికి నిరాకరించారు. ఊహాగానాలపై స్పందించలేమని తేల్చేశారు. బిస్లరీ చైర్మన్ రమేష్ చౌహాన్ కూడా అందుబాటులోకి రాలేదు.