Tata Group IPO | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం).. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా టాటా మోటార్స్ అనుబంధ సంస్థ -టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సుమారు రూ.16 వేల కోట్ల వరకూ నిధుల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గానీ, 2025-26లో గానీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.
టాటా మోటార్స్ అనుబంధ టీపీఈఎం ప్రస్తుతం దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయంలో మొదటి స్థానంలో నిలిచింది. టాటా నెక్సాన్.ఈవీ, టాటా టియాగో.ఈవీ, టాటా పంచ్.ఈవీ తదితర మోడల్ కార్లు తయారు చేస్తున్నది. ఎలక్ట్రిక్ కార్ల విక్రయంలో ప్రస్తుతం టీపీఈఎందే 80 శాతం మార్కెట్ వాటా అని తెలుస్తున్నది. గతేడాది జనవరిలో అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ నుంచి రూ.8,000 కోట్ల నిధులు సమీకరించింది. ప్రస్తుతం 9.5-10 బిలియన్ డాలర్ల విలువ గల టీపీఈఎం.. వచ్చే రెండేండ్లలో రూ.16 వేల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
గతేడాది టాటా టెక్ ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయింది. అంటే సుమారు రెండు దశాబ్దాల తర్వాత టాటా సన్స్ నుంచి వచ్చిన ఐపీఓ టాటా టెక్ ఐపీఓ. దీనికి ఇన్వెస్టర్లు ఊహించినట్లే భారీగా స్పందన లభించింది. రూ.3042 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో 4.5 కోట్ల షేర్లు సబ్ స్క్రిప్షన్ కు పెడితే 69.4 రెట్లు స్పందించారు. ఒక్కో షేర్ విలువ రూ.1200తో దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది.