TCS CEO | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో కం ఎండీగా రాజీనామా చేసిన రాజేశ్ గోపినాథన్తో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమావేశమైనట్లు సమాచారం. సెప్టెంబర్ 15 వరకు రాజేశ్ గోపినాథన్ టీసీఎస్ సీఈవోగా కొనసాగుతారు. ఆ తర్వాత టాటా సన్స్లోనే రాజేశ్ గోపినాథన్ను కొనసాగేందుకు ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. టాటా సన్స్ గ్రూప్ అడ్వైజర్ పాత్ర పోషించాలని కంపెనీ యాజమాన్యం కోరుతున్నట్లు తెలుస్తున్నది. దీనిపై స్పందించేందుకు టాటా సన్స్ గానీ, ఐటీ జెయింట్ టీసీఎస్ గానీ నిరాకరించాయి. అయితే, టాటా సన్స్ వైవిధ్యభరితమైన టెక్నాలజీ సంస్థలను నడుపుతున్నది. ఆయా సంస్థల పురోభివృద్ధికి అనుభవజ్ఞులు అవసరం అని టాటా సన్స్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే రాజేశ్ గోపినాథన్తో చంద్రశేఖరన్ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని టాటా సన్స్ వర్గాల కథనం.
ఇటీవల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో కం ఎండీగా వైదొలుగుతున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించిన రాజేశ్ గోపినాథన్.. `టాటా గ్రూపులో అడ్వైజరీ పాత్ర పోషించేందుకు తక్షణం ప్రణాళికలేం లేవు. అడ్వైజరీ పాత్ర పెరిగిపోతున్నది. సలహాదారులంటే నాకు గౌరవం. దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటికైతే ప్లాన్లేమీ లేవు` అని చెప్పారు.
టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టకముందు టీసీఎస్లో చంద్రశేఖరన్, రాజేశ్ గోపినాథన్ దాదాపు 25 ఏండ్ల పాటు కలిసి పని చేశారు. టీసీఎస్ వృద్ధిలో వారి భాగస్వామ్యంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజేశ్ గోపినాథన్ హయాంటో టీసీఎస్కు 10 బిలియన్ డాలర్ల రెవెన్యూ పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 70 బిలియన్ డాలర్లకు పైగా వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం రూ.10,846 కోట్లకు చేరడంలో రాజేశ్ గోపినాథన్ పాత్ర కాదనలేనిది. గత రెండేండ్లలో రాజేశ్ గోపినాథన్ హయాంలో టీసీఎస్ బ్రాండ్ విలువ 212 శాతం పెరిగి 45.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.