న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలో టాప్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ అంచనాలకు దాదాపు దగ్గరగా ఆర్థిక ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 9 శాతం వృద్ధితో రూ.11,342 కోట్లకు చేరగా, ఆదాయం 8 శాతం పెరిగి రూ.59,692 కోట్ల వద్ద నిలిచింది. నిరుడు ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఫలితాలు కాస్త మెరుగ్గా కన్పిస్తున్నప్పటికీ, ఈ ఏడాది తొలి త్రైమాసికంకంటే ఆదాయం కేవలం 0.5 శాతం, లాభం 2.4 శాతం చొప్పున పెరిగాయి. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.4,150 ధరతో రూ.17,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. టీసీఎస్ చరిత్రలో ఇది 5వ బైబ్యాక్. గత ఏడాదీ రూ.4,500 ధరతో రూ.18,000 కోట్ల బైబ్యాక్ను అమలుపర్చింది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు స్వల్ప నష్టంతో రూ.3,609 వద్ద ముగిసింది. బోర్డు తాజాగా షేరుకు రూ.9 చొప్పున మధ్యంతర డివిడెండ్ను సిఫార్సుచేసింది.
సెప్టెంబర్ చివరినాటికి టీసీఎస్ వద్ద 11.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్ బుక్ ఉన్నది. ముగిసిన త్రైమాసికంలో రెండవ అతిపెద్ద ఆర్డరును సంపాదించామని, మరిన్ని పైప్లైన్లో ఉన్నాయని ఈ సందర్భంగా కంపెనీ సీఈవో కృతివాసన్ చెప్పారు.
జూలై-సెప్టెంబర్లో కంపెనీ నుంచి వెళ్లిన ఉద్యోగులకంటే వచ్చినవారే తక్కువ. ప్రస్తుతం 6,08,985 సిబ్బంది ఉన్నట్టు టీసీఎస్ సీఎఫ్వో సమీర్ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్య వినియోగం, ఉత్పాదకతల్ని మెరుగుపర్చడంపై కంపెనీ దృష్టి నిలిపిందన్నారు.
కరోనాతో ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రం హోంకు టీసీఎస్ గుడ్బై చెప్పింది. ఇక ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే పనిచేయాలన్నది. ఈ మేరకు టీసీఎస్ చీఫ్ హ్యుమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింగ్ లక్కడ్ మీడియాకు తెలిపారు.