Tata Motors | టాటా మోటార్స్ కార్ల ధరలు మరోసారి పెరుగనున్నాయి. అన్ని రకాల ఐసీఈ (ICE) ఇంజిన్ల కార్లు, ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఈ నెల 17 నుంచి పెరుగుతాయని సోమవారం టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ మేరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్లో వెల్లడించింది. విభిన్న మోడల్స్, వేరియంట్ కార్లపై సగటున 0.6 శాతం చొప్పున ధరలు పెరుగుతాయి. ఇన్ పుట్ వ్యయం పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని టాటా మోటార్స్ తెలిపింది.
ఈ ఏడాది టాటా మోటార్స్ కార్ల ధరలు పెంచడం ఇది మూడోసారి. తొలుత ఫిబ్రవరిలో అన్ని కార్ల ధరలు పెంచేసింది. తిరిగి ఏప్రిల్ 14న అన్నికార్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని ప్రకటించింది.
మీరు టాటా మోటార్స్ కారు కొనాలని భావిస్తే ఈ నెల 16వ తేదీ వరకు స్వల్పంగా ధరలు తగ్గుతాయి. 13 రోజుల తర్వాత అన్ని కార్ల ధరలు కాస్ట్లీ కానున్నాయి. జూలై 16 వరకు కస్టమర్లు బుక్ చేసుకున్న కార్లను ఈ నెలాఖరుకల్లా పాత ధరలు, ఆఫర్లకే డెలివరీ చేస్తారు. ఇక కమర్షియల్ వాహనాల ధరలు గత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదు శాతం చొప్పున పెరిగాయి. ఫిబ్రవరిలో అన్ని రకాల ఐసీఈ ఇంజిన్ కార్ల ధరలు 1.2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది టాటా మోటార్స్.
టాటా టియాగో ఈవీ కారు ధర ఫిబ్రవరి 10న రూ.20 పెరిగింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండో దశ బీఎస్-6 ప్రమాణాలను అమల్లోకి తెచ్చాక మరో దఫా టాటా మోటార్స్ ఈవీ కార్ల ధరలు పెరిగాయి. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్ వంటి కార్లతోపాటు ఎస్యూవీ మోడల్స్ పంచ్, నెక్సాన్, సఫారీ, హారియర్ కార్లు విక్రయిస్తున్నది టాటా మోటార్స్.