Tata-Indigo on Go Air | నిధుల కొరతతో స్వచ్చంద దివాళా పరిష్కార ప్రక్రియ పిటిషన్ దాఖలు చేసిన ఎయిర్ లైన్స్ ‘గోఫస్ట్’ ఆస్తులు, లీజ్ హక్కులను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్ సంప్రదింపులు జరుపుతున్నాయి. దివాళా పరిష్కార ప్రక్రియ కోసం పిటిషన్ వేసినందున టికెట్ల విక్రయాలు నిలిపేయాలని గోఫస్ట్ యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించేందుకు గో ఎయిర్, ఎయిర్ ఇండియా ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. ఇండిగో అధికార ప్రతినిధి కూడా ఊహాగానాలపై స్పందించబోమని స్పష్టం చేశారు.
గో ఎయిర్ లైన్స్ లెజర్స్తో టాటా గ్రూప్, ఇండిగో యాజమాన్యాలు వేర్వేరుగా సంప్రదింపులు జరుపుతున్నాయని. గోఫస్ట్ విమానయాన సంస్థకు న్యూఢిల్లీ, ముంబైతోపాటు వివిధ ఎయిర్ పోర్ట్ ఆపరేటర్ల వద్ద గల ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్స్ కోసం ఈ రెండు సంస్థల ప్రతినిధులు సంప్రదిస్తున్నట్లు తెలిసింది. గో ఎయిర్ లైన్స్ లెజర్స్ తమ 36 విమానాలను తిరిగి స్వాధీనం చేయాలని డీజీసీఏ వద్ద ఫైలింగ్ చేయనున్నాయి.
వివిధ విమానాశ్రయాల్లో గోఫస్ట్ స్లాట్లను సొంతం చేసుకోవడానికి టాటా ఎయిర్ఇండియాతోపాటు న్యూ ఎయిర్ లైన్స్ ఆకాశ ఎయిర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గోఫస్ట్ విమానయాన సంస్థ రుణాల పునర్వ్యవస్థీకరణకు యత్నం, సర్వీసుల పునరుద్ధరణ సంక్లిష్టంగా మారాయన్న అభిప్రాయాల నేపథ్యంలో టికెట్ల విక్రయాలు నిలిపేయాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించింది. గో ఎయిర్ విమానాల నిర్వహణకు ఆపరేటింగ్ లైసెన్స్ కొనసాగిస్తుందా.. లేదా? అన్న సంగతి రెండు వారాల్లో తేలనున్నది. గో ఎయిర్ సంస్థకు స్కై హై ఎక్స్ సీవీ లీజింగ్, ఏసీసీ ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ ఐర్లాండ్, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ సంస్థలు ప్రధాన లీజుదారులుగా ఉన్నారు.
2005లో నుస్లీ వాడియా.. గో ఎయిర్ విమానయాన సంస్థను స్థాపించారు. తమ సంస్థ విమానాల్లో వాడుతున్న ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లు ఊహించిన దానికన్నా వేగంగా దెబ్బ తింటున్నాయని, ముందస్తుగానే మూలన పడుతున్నాయని గో ఎయిర్ తెలిపింది. 2016 నుంచి గత ఫిబ్రవరి వరకు 500కి పైగా ప్రాట్ జీటీఎఫ్ ఇంజిన్లు రీప్లేస్ చేయాల్సి ఉందన్నారు. ఇంజిన్లు అందుబాటులో లేక విమాన సర్వీసులు నిలిపేయడంతో రూ. 10,800 కోట్ల నష్టాల్లో కూరుకున్నది. విడి భాగాల సరఫరాలో అంతరాయం, నూతన వాణిజ్య జెట్ లైనర్ విమానాల కొరతతో మరోసారి గో ఎయిర్ కష్టాలు వెలుగు చూశాయి.
గతేడాది కేంద్రం నుంచి ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్న టాటా.. మహారాజకు పూర్వ వైభవం తేవడానికి, విమాన సర్వీసులు పెంచడానికి చర్యలు చేపడుతున్నది. ఇటీవలే ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలతో 470 విమానాల కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నది. బడ్జెట్ ఆపరేటర్ ఇండిగో మార్చిలో దేశీయంగా 73 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో దాదాపు 60 శాతం వాటా కలిగి ఉంది.