Electric Vehicles | ఇప్పుడంతా విద్యుత్ వాహనాల హయాం.. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కు చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంటేనే పర్యావరణ హితం.. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం తేలికవుతుంది. ఆ దిశగా కేంద్ర చమురు సంస్థలు మొదలు ప్రైవేట్ ఎలక్ట్రిక్, ఆటోమొబైల్, టెక్నాలజీ సంస్థలు అడుగులేస్తున్నాయి. భాగస్వామ్య ఒప్పందాలతో ముందుకు వస్తున్నాయి.
ఆ దిశగా తైవాన్ ఎలక్ట్రిక్ మేజర్ గొగొరో ( Gogoro ) ఓ అడుగు ముందుకేసింది. దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్స్తో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పార్టనర్షిప్ కలిగి ఉంది. ఇక నుంచి బజాజ్ ఆటో, టీవీఎస్, యమహా వంటి ఇతర టూ వీలర్స్ కంపెనీలకు బ్యాటరీ స్వాపింగ్ (ఈవీ బ్యాటరీల చార్జింగ్) స్టేషన్లను ఏర్పాటు చేయడానికి చేతులు కలిపేందుకు సిద్ధమైంది. సొంతంగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నట్లు సంకేతాలిచ్చింది.
కరోనా తర్వాత పలు స్టార్టప్ కంపెనీలు విద్యుత్ వెహికల్స్ తయారీలోకి వచ్చేశాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్ను వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నామని గొగోరో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కం ఫౌండర్ హోరాస్ లూక్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు కలిగి ఉన్న సంస్థ గొగొరో.. రోజూ 3.7 లక్షల వెహికల్స్ బ్యాటరీ చార్జింగ్ చేస్తున్నది.
భారత్లో బీ2బీ డెలివరీ ప్రొవైడర్ జైప్ ఎలక్ట్రిక్తో కలిసి తమ ఉత్పత్తులను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నది గొగొరో. `భారత్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్, అంతకంటే ఎక్కువ రికార్డవుతుంటాయి. తదనుగుణంగా భారత్లో జైప్ సహకారంతో తమ ప్లాట్ఫామ్పై తమ వెహికల్స్ను పరీక్షిస్తాం అని హోరాస్ లుక్ వెల్లడించారు. 100 జైప్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు బ్యాటరీలు, ఆరు బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు కల్పిస్తామని తెలిపారు. భారత్లో బ్యాటరీల తయారీతోపాటు స్వాపింగ్ స్వాపింగ్ స్టేషన్ల విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
`హీరో హోటో కార్ప్స్తో మా భాగస్వామ్యం ఎల్లవేళలా బహిరంగమే. మా సొంత ఉత్పత్తులను ఎప్పుడైనా ఆవిష్కరించే స్వేచ్ఛ మాకు ఉంది. మా చార్జింగ్ ప్లాట్ఫామ్స్ వద్ద చార్జింగ్ కోసం ఇతర కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం` అని హొరాస్ లుక్ తెలిపారు. భారత్ వంటి మార్కెట్లలో విస్తరణకు అవసరమైన నిధులు సమకూర్చగల వెసులుబాటు గొగొరోకు ఉందన్నారు.