హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్ల క్రితం చిన్న స్థాయిలో ప్రారంభమైన టీ హబ్ ప్రస్తుతం దేశంలోనే స్టార్టప్ హబ్గా ఎదిగిందని, ఇందులోని సంస్థలు 3.5 బిలియన్ డాలర్ల(29 వేల కోట్లకు పైగా) నిధులు ఆకర్షించాయని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. టీ హబ్ ప్రారంభించి ఎనిమిదేండ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రారంభమైన టీ హబ్ సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని, ఇక్కడి నుంచి రోజుకొక స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు చాలా స్టార్టప్లు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాయని, వీటితోపాటు 600 కార్పొరేట్ సంస్థలతోనూ జతకట్టాయని, 500 మంది మెంటార్తో కలిసి 3 వేలకు పైగా స్టార్టప్లను టీ హబ్ ప్రోత్సహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఇప్పటికే టీ హబ్ ద్వారా టీ బ్రిడ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లకు మార్కెటింగ్ అవకాశాలను కల్పించామన్నారు. టీ హబ్ వ్యవస్థాపక డైరెక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. టీ హబ్ ఎదుగుదల ఎంతో గర్వించదగిన విషయమని, స్టార్టప్ రంగంలోనే సరికొత్త వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు.
ఎనిమిదేండ్లు పూర్తైన సందర్భంగా టీ హబ్ తాజాగా 6 ప్రముఖ పరిశ్రమలతో జట్టుకట్టింది. ఇందులో కేర్, క్యారియర్ గ్లోబల్, సిడ్బీ, ఫాల్కన్ ఎక్స్, కేపీఎంజీ, అసోసియేషన్ ఆఫ్ జియో స్పేషియల్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటితో పాటు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న సోషల్ బిజినెస్, డిజైన్ థింకింగ్, క్రాస్ బార్డర్ సపోర్టు, జియోస్పేషియల్ ఇన్నోవేషన్ రంగాల్లోనూ ఎక్కువగా దృష్టిని సారించింది.