వడ్డీ రేట్లను మరింత ఎక్కువస్థాయిలో పెంచుతామంటూ అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పొవెల్ వ్యాఖ్యలు, ఆ దేశంలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) సంక్షోభంపై వెలువడిన వార్తలు గత వారాంతంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేశాయి. గతవారం ప్రధమార్థంలో 17,800 పాయింట్ల వరకూ ఎన్ఎస్ఈ నిఫ్టీ ర్యాలీ జరిపినప్పటికీ, గురు, శుక్రవారాల్లో తీవ్రంగా పతనమయ్యింది.
మొత్తంమీద నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 17,413 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్లో ఇప్పటికే ఎస్జీఎక్స్ నిఫ్టీ 100 పాయింట్ల వరకూ తగ్గిఉన్నందున, ఈ సోమవారం గ్యాప్డౌన్తో మార్కెట్ ప్రారంభమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటుపైన ఎస్వీబీపై వెలువడే వార్తలు, ఈ వారం వెల్లడికానున్న దేశీయ ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు స్టాక్ సూచీలను నిర్దేశిస్తాయని అంటున్నారు. అలాగే ఫెడ్ రేట్ల నిర్ణయానికి కీలకమైన యూఎస్ ద్రవ్యోల్బణం డాటా సైతం ఈ వారం వెలువడనుంది.
నిఫ్టీ కీలకస్థాయి 17,200
గతవారం నిఫ్టీ 200 డీఎంఏ దిగువన ముగిసినందున, సమీపకాలంలో ట్రెండ్ బేరిష్గానే ఉంటుందని బొనంజా పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ అషీశ్ కత్వా చెప్పారు. ఈ వారంలో నిఫ్టీకి 17,200 స్థాయి కీలకమని తెలిపారు. 17,250, 17,000 పాయింట్ల స్థాయిలు మద్దతును అందించవచ్చని, 17,550, 17,780 పాయింట్ల స్థాయిలు అవరోధం కల్గించవచ్చని అషీశ్ అంచనా వేశారు.