న్యూఢిల్లీ, జూలై 23: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ సంస్థలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్)కు సంబంధించిన బకాయిల మదింపులో తప్పులు దొర్లాయని, వాటిని సరిదిద్దాలంటూ వేసిన పిటిషన్లను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎల్ఎన్ రావు, హృషికేష్ రాయ్ న్యాయమూర్తుల ధర్మాసనం టెలికం కంపెనీల పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే మరోసారి బకాయిల గణన ఉండబోదంటూ ఈ అంశంలో గతంలో ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వానికి టెల్కోలు రూ.93,520 కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉన్న విషయం తెలిసిందే. టెల్కోల అభ్యర్థనతో చెల్లింపులకు పదేండ్ల గడువునిస్తూ గతేడాది సుప్రీం కోర్టు వెసులుబాటును కల్పించిన సంగతీ విదితమే. వార్షిక ఏజీఆర్లో నాన్-కోర్ బిజినెస్ నుంచి వచ్చే రెవిన్యూ కూడా భాగమేనన్న కేంద్ర ప్రభుత్వ వాదనతో నాడు సుప్రీం కోర్టు ఏకీభవించింది. అయితే బకాయిలను టెలికం శాఖ సరిగా అంచనా వేయలేదని, మళ్లీ లెక్కించాలని కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి.