Super rich Indians | పలువురు సూపర్ రిచ్ ఇండియన్లు దుబాయిలో ఆస్తుల కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ ఇండ్ల కొనుగోళ్లకు డిజిటల్ కరెన్సీతో పేమెంట్స్ జరుపుతున్నారు. దుబాయ్ పాలకులు వివిధ లావాదేవీలకు డిజిటల్ కరెన్సీ చెల్లింపులను అనుమతించారు. దుబాయ్లో డిజిటల్ కరెన్సీ లావాదేవీలు చట్టబద్ధమే. క్రిప్టో క్యాపిటల్గా నిలవాలని కోరుకుంటున్నది దుబాయ్. ఇలా డిజిటల్ కరెన్సీలతో దుబాయ్లో ఇండ్లు, ఆస్తులు కొనుగోలు చేసిన భారతీయులు.. దేశీయంగా చట్టపరంగా, పన్నుల రూపేణా సవాళ్లు ఎదుర్కొంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మెదులుతోంది.
ఇలా దుబాయ్లో ఇండ్లు కొనుగోలు చేసిన వారి పాస్పోర్ట్లు గానీ, ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిపిన కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువుల సమాచారం అందుబాటులో లేదు. వీరందరి వివరాలు భవిష్యత్లో భారత ఆదాయం పన్ను శాఖ (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి దుబాయ్ అధికారులు ఫార్వర్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వర్చువల్ డిజిటల్ అసెట్స్పై ఆర్బీఐ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే ఆదాయంపై 30 శాతం ఐటీ విధించాలని కేంద్రం నిర్ణయించింది. డిజిటల్ అసెట్స్ కోసం ఏడాదిలో రూ.10 వేలకు పైగా చెల్లిస్తే ఒకశాతం టీడీఎస్ డిడక్ట్ చేయాలని కూడా నిర్ణయించింది. కానీ, సంపన్నులు తమ వర్చువల్ డిజిటల్ అసెట్స్ను దుబాయ్, ఇతర విదేశీ కేంద్రాలకు తరలించారని వార్తలొస్తున్నాయి. తద్వారా వారు తమకు తెలియకుండానే పన్ను ఎగవేతకు, ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ధృవీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలుత భారతీయ సంపన్నులు తమ క్రిప్టో కరెన్సీలను ప్రైవేట్ వాలెట్ నుంచి దుబాయ్లోని రియల్ ఎస్టేట్ వాలెట్కు తరలించడం గానీ.. క్రిప్టో కరెన్సీలను మార్చుకోవడానికి దుబాయ్లోని రియాల్టీ ఏజంట్లను నియమించుకోవడం గానీ చేసి ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల విదేశీ మారక ద్రవ్య యాజమాన్యం చట్టం (ఫెమా) .. Foreign Exchange Management Act (FEMA) చట్టాన్ని ఉల్లంఘించినట్లవుతుందని వార్తలొచ్చాయి. ఇది చట్ట విరుద్ధ సీమాంతర నగదు లావాదేవీల కిందకు వస్తుందని భావిస్తున్నారు.ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకింగ్ చానెళ్ల ద్వారా నగదు లావాదేవీలు సరిపోలకుండానే విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. భారతీయులు ప్రతి ఒక్కరూ తమ ఆదాయ వనరులను ఐటీ రిటర్న్స్లో తెలియచేయాల్సి ఉంటుంది.
దుబాయ్లో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారు, కొనే భారతీయులు.. రెండు దేశాల్లో చట్టాలను అర్థం చేసుకోవడానికి టాక్స్ ప్రొఫెషనల్స్ను తప్పనిసరిగా సంప్రదించాల్సిందేనని కరణ్ బత్రా అనే చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పారు. చాలా మంది భారతీయులు దుబాయ్లోని రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. ఆస్తుల కొనుగోళ్లకు క్రిప్టో కరెన్సీ చెల్లింపులను అనుమతించినా.. చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీలకు కేంద్రం కావాలని దుబాయ్ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.