న్యూడిల్లీ : ఉద్యోగుల సామర్ధ్యంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసంతృప్తిగా ఉన్నట్టు సంకేతాలు పంపారు. ప్రోడక్ట్స్ సామర్ధ్యం పెంచి, కస్టమర్లకు సాయం అందించేలా ఉద్యోగులు మరింత శ్రద్ధగా, నైపుణ్యాలతో పనిచేయాలని సిబ్బందిని సుందర్ పిచాయ్ హెచ్చరించారు. గూగుల్లో ఎంతోమంది ఉద్యోగులున్నప్పటికీ కొద్దిపాటి పనులే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్పాదకత పెంపొందించడం, కస్టమర్లకు మెరుగైన సేవలందించేలా మెరుగైన నైపుణ్యాలతో ఉద్యోగులు పనిచేయాలని సుందర్ పిచాయ్ సూచించారని సీఎన్బీసీ రిపోర్ట్ వెల్లడించింది. 2022 రెండో క్వార్టర్లో కంపెనీ ఆదాయం, రాబడి అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయనే వార్తల నేపధ్యంలో గూగుల్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే సాఫ్ట్వేర్ దిగ్గజం వృద్ధి రేటు 13 శాతం తక్కువగా నమోదైంది.
నైపుణ్యాల లేమి, సామర్ధ్యం మేర పనిచేయని ఉద్యోగులను కంపెనీ తొలగించవచ్చని గూగుల్ సీఈఓ వ్యాఖ్యలతో తేటతెల్లమవుతోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కూడా గూగుల్ రాబోయే క్వార్టర్లలో ఉద్యోగులపై వేటు వేయవచ్చని భావిస్తున్నారు. ఆర్దిక మాంద్య భయాలతో హైరింగ్ ప్రక్రియను కూడా నెమ్మదించనున్నట్టు గూగుల్ ఇప్పటికే ప్రకటించింది.