ముంబై, జనవరి 2: దేశీయ స్టాక్ మార్కె ట్లు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 327.05 పాయింట్లు లేదా 0.54 శాతం ఎగిసి 61,167.79 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 92.15 పాయింట్లు లేదా 0.51 శాతం పుంజుకొని 18,197.45 వద్ద నిలిచింది. సానుకూల స్థూల ఆర్థిక గణాంకాలు, ఐరోపా స్టాక్ మార్కెట్ల లాభాలు కలిసొచ్చాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
టాప్ గెయినర్ టాటా స్టీల్
సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా టాటా స్టీల్ షేర్ విలువ పెరిగింది. ఏకంగా 5.86 శాతం ఎగబాకింది. టాటా మోటర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లూ లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ 0.84 శాతం, మిడ్క్యాప్ 0.57 శాతం లేచాయి. రంగాలవారీగా మెటల్ 2.83 శాతం, టెలీకమ్యూనికేషన్ 1.32 శాతం, సేవలు 1.08 శాతం, కమోడిటీస్ 1.23 శాతం, రియల్టీ 0.99 శాతం, ఇండస్ట్రీయల్స్ 0.76 శాతం పెరిగాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా సూచీ నష్టపోగా, సింగపూర్, జపాన్, హాంకాంగ్ సూచీలకు సెలవు. అయితే ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్లు ఆకర్షణీయ లాభాల్లో కదలాడుతున్నాయి. కాగా, శుక్రవారం ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) రూ.2,950.89 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
రూపాయి 17 పైసలు పతనం
ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ నూతన సంవత్సరానికి నష్టాలతోనే ఆహ్వానం పలికింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించింది. 82.78 వద్ద నిలిచింది. గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలకుతోడు.. దేశీయ మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.