ముంబై, జనవరి 3: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం పలికాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఎనర్జీ రంగాల షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సోమవారం సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. కరోనా కేసులు, ముఖ్యంగా ఒమిక్రాన్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నా.. ఉదయం ఆరంభం నుంచే మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం విశేషం. ఈ క్రమంలోనే సమ యం గడుస్తున్నకొద్దీ లాభాలు పెరుగుతూపోయాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 929.40 పాయింట్లు లేదా 1.60 శాతం ఎగబాకి 59,183.22 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 59,266.39 స్థాయినీ తాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 271.65 పాయింట్లు లేదా 1.57 శాతం ఎగిసి 17,625.70 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ అత్యధికంగా 3.52 శాతం లాభపడింది. అయితే డాక్టర్ రెడ్డీస్ తదితర షేర్లు నష్టపోయాయి. కాగా, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. క్రిందటి వారంలోనూ లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు.. గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2021లో సెన్సెక్స్ 10,502.49 పాయింట్లు పుంజుకున్నది. ఇక ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు లాభపడితే.. జపాన్, చైనా సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో మాత్రం సూచీలు లాభాల్లోనే కదలాడాయి.
రూ.3.49 లక్షల కోట్లు జూమ్
స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద ఈ ఒక్కరోజే రూ.3.49 లక్షల కోట్లు ఎగిసింది. బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.3,49,642.03 కోట్లు పెరిగి రూ.2,69,49,853.58 కోట్లకు చేరింది. ‘దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నా.. భారతీయ ఈక్విటీ మార్కెట్ కొత్త సంవత్సరానికి లాభాలతో ఆహ్వానం పలకడం శుభసూచకం. ఆటో రంగ షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి’ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రిసెర్చ్ అధిపతి సంతోష్ మీనా అన్నారు.