ముంబై, జూలై 29: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 888.68 పాయింట్లు లేదా 1.16 శాతం ఎగబాకి 77,654.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 264.85 పాయింట్లు లేదా 1.10 శాతం అందుకొని 24,250.20 వద్ద ముగిసింది. వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయానికి ముందు మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.