ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కుపైగా చేరుకోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరో వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదలయ్యే ప్రమాదముందని మదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1172 పాయింట్ల నష్టంతో 57,167 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇంట్రా డేలో 57,338 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేదు. అమ్మకాల ఒత్తిడితో ఒక
దశలో 56,842 పాయింట్లకు పడిపోయింది.
ఆ తర్వాత కాస్త కొలుకొని 57,167 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సే్ంచ్ సూచీ నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 17,173 వద్ద ట్రేడింగ్ ముగిసింది. సోమవారం జరిగిన ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ 7శాతం పతనమవగా.. ఎన్టీపీసీ ఆరుశాతం లాభపడింది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ నష్టాల పాలవగా.. టాటాస్టీల్, నెస్లే, టైటాన్, హిందూస్థాన్ యూనిలివర్, మారుతి, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి.