ముంబై, జనవరి 3: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను మరింత నష్టాల్లోకి నెట్టాయి. ఒక దశలో 600 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 535.88 పాయింట్లు కోల్పోయి 71,356.60 వద్ద ముగిసింది. మరోసూచీ నిఫ్టీ 148.45 పాయింట్లు తగ్గి 21,517.35 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్ మీటింగ్ మినిట్స్తోపాటు దేశీయ పీఎంఐ ఇండెక్స్ సూచీ ఏడాదిన్నర కనిష్ఠానికి పడిపోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా దేశీయ ఐటీ, బ్యాంకింగ్ షేర్లతోపాటు మెటల్, కమోడిటీ షేర్లు పతనాన్ని నమోదు చేసుకున్నాయి.