Stock Markets | ముంబై, జూలై 13: దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులు.. భారీ లాభాలను ఆవిరి చేసేశాయి. గురువారం ట్రేడింగ్లో ఆరంభం నుంచే మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేయడంతో సూచీలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ క్రమంలోనే ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 670.31 పాయింట్లు ఎగబాకి తొలిసారి 66 వేల మార్కును దాటి మునుపెన్నడూ లేనివిధంగా 66,064.21 స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 182.7 పాయింట్లు ఎగిసి మొదటిసారి ఇంట్రా-డేలో 19,567 స్థాయికి వెళ్లింది. అయితే ఈ దశలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీల్లో క్షీణత మొదలైంది. చివరకు సెన్సెక్స్ 164.99 పాయింట్లు లేదా 0.25 శాతం లాభాలకు పరిమితమై 65,558.89 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 29.45 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 19,413.75 వద్ద నిలిచింది.
ఐటీ షేర్ల మద్దతుతో..
మదుపరులను ఐటీ షేర్లు అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ షేర్ విలువ దాదాపు 3 శాతం పుంజుకున్నది. సెన్సెక్స్లో అత్యధికంగా 2.47 శాతం పెరిగి రూ.3,340.65 వద్ద ముగియగా, నిఫ్టీలో 2.59 శాతం ఎగిసి రూ.3,344.50 వద్ద నిలిచింది. ఈ ఏప్రిల్-జూన్లో సంస్థ లాభం గతంతో పోల్చితే 16.83 శాతం ఎగబాకి రూ.11,074 కోట్లకు చేరడం కలిసొచ్చింది. ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్ షేర్లూ లాభపడ్డాయి. రియల్టీ, మెటల్ రంగాల షేర్లూ మెరిశాయి. కాగా, బీఎస్ఈ మిడ్క్యాప్ 0.64 శాతం, స్మాల్క్యాప్ 0.54 శాతం చొప్పున పతనమయ్యాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ ఏర్పడింది. దీనికి అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాల్లో తగ్గుదల కూడా తోడైందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభపడగా.. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు లాభాల్లో కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్ కదలికలూ జోష్నిచ్చాయి.