Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్తగా ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. బీఎస్ఈ సెనెక్స్ 64వేల మార్క్ను దాటగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 19వేల మార్క్ను అందుకున్నది. చివరకు అమ్మకాల ఒత్తిడితో కాస్త తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు, హెచ్డీఎఫ్సీ విలీన అమలు ప్రకటన నేపథ్యంలో సూచీలు జీవనకాలంలో గరిష్ఠానికి చేరుకునేందుకు దోహదపడ్డాయి. దాంతో పాటు మార్కెట్లో మెటల్, ఫార్మారంగ షేర్లు సైతం మద్దతిచ్చాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 63,701 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. మధ్యాహ్నం వరకు 64వేల మార్క్ను చేరుకుంది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 64,050.44 పాయింట్లను తాకింది.
చివరకు 499.39 పాయింట్ల లాభంతో 63,915.42 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఉదయం లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 19,011 పాయింట్లు చేరి.. ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకి.. చివరకు రూ.18,972.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. మూడు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.3లక్షల కోట్లకుపైగా సంపదను ఆర్జించారు. సెన్సెక్స్లో టాప్ గెయినర్స్గా టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టైటన్ కంపెనీ, లార్సెన్ నిలిచాయి. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వీస్, కొటక్ మహీంద్రా, విప్రో షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, బాజాజ్ ఆటో లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఎంఅండ్ఎం, అపోలో హాస్పిటల్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.