Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు, విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి కొనుగోళ్లతో బెంచ్ మార్క్ సూచీలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గతవారం ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకున్న స్టాక్ మార్కెట్లు సోమవారం మరోసారి మరోసారి జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 64,836 వద్ద లాభాలతో మొదలైంది. కొద్ది సమయానికే 65వేల మార్క్ను చేరుకుంది. ఇంట్రాడేలో 65,300.35 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 486.49 పాయింట్ల లాభంతో 65,205.05 పాయింట్ల వద్ద ముగిసింది.
మరో వైపు నిఫ్టీ 133.50 పాయింట్ల లాభంతో 19,322.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్లో అమెరికా డాలర్తో రూపాయి 15 పైసలు బలపడి 81.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లో అన్నిరంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. పీఎస్యూ బ్యాంక్, ఫైనాన్షియల్, మెటల్ రంగాల షేర్లు మోతమోగించాయి. దాదాపు 1910 షేర్లు పురోగమించగా, 1688 షేర్లు క్షీణించాయి. 138 షేర్లు మారలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐటీసీ, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా లాభపడ్డాయి. బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్ప్, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నష్టపోయాయి.