దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. దేశ, విదేశీ పరిణామాలు మదుపరులను అమ్మకాలు-కొనుగోళ్ల మధ్య ఊగిసలాటకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత వారం స్టాక్ మార్కెట్లు పడుతూ..లేస్తూ.. కొనసాగాయి. అయినప్పటికీ అంతిమంగా లాభాలనే అందుకోగలిగాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,876.12 పాయింట్లు లేదా 3.61 శాతం ఎగబాకి 82,330.59 వద్ద స్థిరపడింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 1,011.80 పాయింట్లు లేదా 4.21 శాతం ఎగిసి 25,019.80 దగ్గర ముగిసింది. దీంతో ఈ వారం కూడా సూచీలు ఆటుపోట్లకు లోనుకావచ్చన్న అంచనాలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు దేశ జీడీపీ గణాంకాలు విడుదల కావాల్సి ఉన్నది. ఇవి కూడా ట్రేడింగ్ను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. భారత్-పాకిస్థాన్ వ్యవహారాలు, అమెరికా-చైనా ట్రేడ్ డీల్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలకు సంబంధించిన అప్డేట్స్ సైతం కీలకం కానున్నాయి.
అలాగే ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, ముడి చమురు ధరలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,700 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,400 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,400-25,700 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.