Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభంలో లాభాలతో ప్రారంభమైనా, ట్రేడింగ్ ముగింపు సమయంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 350 పాయింట్లకు పైగా పుంజుకుని 76,861 పాయింట్ల గరిష్టాన్ని తాకి చివరకు 33 పాయింట్ల నష్టంతో 76,457 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్ లో 23,380 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లినా, చివర్లో ఆరు పాయింట్ల లాభంతో 23,265 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ -30లో లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ) భారీగా లబ్ధి పొందింది. టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ తదితర స్టాక్స్ స్వల్ప లాభాలతో ముగిశాయి. మరోవైపు కోటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ ఒక శాతానికి పైగా నష్టపోగా, రిలయన్స్, ఐటీసీ స్టాక్స్ కనీసం ఒక శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 140 పాయింట్లు నష్టపోవడానికి ఈ స్టాక్స్ కారణం. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.7 శాతం, స్మాల్ క్యాప్ ఒకశాతం లాభ పడ్డాయి. బీఎస్ఈలో 2468 స్టాక్స్ లాభ పడగా, 1390 స్టాక్స్ నష్టపోయాయి.