Stock Market Close | వారంలో తొలిరోజైన సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు సైతం రాణించాయి. మార్చి త్రైమాసిక ఫలితాల అనంతరం బ్యాకింగ్, ఫైనాన్షియల్ స్టాక్లో బలమైన కొనుగోళ్లు జరిగాయి. గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు సైతం సెంటిమెంట్ను బలపరిచాయి. ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం, యూఎస్ ఉద్యోగాల డేటాపై పెట్టుబడిదారులు తమ దృష్టిని మళ్లించడంతో ప్రధాన యూరోపియన్ మార్కెట్లు, యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు పెరిగాయి.
సమీప భవిష్యత్తులో రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ స్టాక్స్ సూచీలు ఎగబాకాయి. ఇదిలా ఉండగా.. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 73,982.75 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,922.34 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 74,721.15 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 941.12 పాయింట్ల లాభంతో 74,671.28 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 223.45 పాయింట్ల లాభంతో 22,643.40 వద్ద స్థిరపడింది. దాదాపు 1,777 షేర్లు పురోగమించగా.. 1578 షేర్లు పతనమయ్యాయి.
నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్లు నిలిచాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీఐఎండ్ట్రీ నష్టపోయాయి. రియాల్టీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు హెల్త్కేర్, మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ 0.4-2 శాతం వృద్ధితో గ్రీన్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరిగింది. స్మాల్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ తాజా రికార్డు గరిష్ఠ స్థాయిలో 49,473.60కి ఎగిసింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ సెషన్లో 7,589.80 వద్ద తాజా రికార్డు స్థాయికి చేరింది.