Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. దాంతో సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు ఉన్నా.. మార్కెట్లు సోమవారం లాభాల్లో మొదలై చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 72,627.60 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గినా.. ఆ తర్వాత తేరుకున్నాయి.
ఇంట్రాడేలో 72,308.68 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెనెక్స్.. ఒక దశలో 72,881.93 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 281.52 పాయింట్ల లాభంతో 72,708.16 వద్ద స్థిరపడింది. నిఫ్టీ క్రితం పోలిస్తే లాభాల్లోనే 22,103.45 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఒక దశలో 22,021.05 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్న నిఫ్టీ.. ఆ తర్వాత తేరుకొని 22,186.65 పాయింట్ల వద్ద ఆల్టైమ్ హైకి చేరుకున్నది. చివరకు 81.55 పాయింట్ల లాభంతో 22,122.25 వద్ద ముగిసింది.
సోమవారం మార్కెట్లో దాదాపు 2,184 షేర్లు పురోగమించగా.. 1,243 షేర్లు పతనమయ్యాయి. 123 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా టాప్ గెయినర్లు నిలిచాయి. కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి. సెక్టార్లలో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ మెటల్, రియల్టీ నష్టపోగా.. ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ 0.3 నుంచి ఒకశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం చొప్పున పెరిగాయి.