ముంబై, డిసెంబర్ 6: వరుసగా మూడో రోజూ కొనుగోళ్లు కొనసాగడంతో బుధవారం ప్రధాన స్టాక్ సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 70,000 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 20,100 పాయింట్ల స్థాయిని టార్గెట్ చేస్తూ ముందుకు కదిలాయి. మరో 358 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఆల్టైమ్ రికార్డుస్థాయి 69,654 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 69,745 పాయింట్ల స్థాయిని తాకింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 20,962 పాయింట్ల వరకూ పెరిగిన నిఫ్టీ చివరకు 83 పాయింట్లు లాభపడి నూతన గరిష్ఠస్థాయి 20,938 పాయింట్ల వద్ద నిలిచింది.
వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్లు జరుపుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కొద్ది నెలలపాటు అదేపనిగా విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గడంతో తిరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు చేస్తున్నారని వివరించారు.
అయితే మార్కెట్ ప్రీమియం విలువల కారణంగా షార్ట్ టెర్మ్లో లాభాల స్వీకరణ జరగవచ్చని నాయర్ హెచ్చరించారు. మంగళవారం భారీగా రూ.5,200 కోట్లు నిధుల్ని కుమ్మరించిన ఎఫ్పీఐలు బుధవారం స్వల్పంగా రూ.80 కోట్ల నికర విక్రయాలు జరిపారు. అయితే దేశీయ సంస్థలు రూ. 1,372 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల సమాచారం వెల్లడిస్తున్నది.
ఐటీ షేర్ల నేతృత్వంలో ర్యాలీ
తాజా మార్కెట్ ర్యాలీకి ఐటీ షేర్లు నేతృత్వం వహించాయి. సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా విప్రో 3.85 శాతం పెరిగింది. టీసీఎస్, ఎల్ అండ్ టీలు 2.3 శాతం వరకూ లాభపడగా, ఐటీసీ 2.5 శాతం జంప్చేసింది. ఎన్టీపీసీ 3.89 శాతం చొప్పున పెరిగాయి. టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్లు 1-2 శాతం మధ్య ఎగిసాయి. మరోవైపు ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్లు 1.58 శాతం వరకూ క్షీణించాయి. 1.49 శాతం వరకూ తగ్గాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ రంగాల సూచీల్లో యుటిలిటీస్ ఇండెక్స్ 3శాతం పెరిగింది. పవర్ ఇండెక్స్ 2.41 శాతం ఎగిసింది. ఐటీ ఇండెక్స్ 1.48 శాతం, టెక్ ఇండెక్స్ 1.18 శాతం మేర పెరిగాయి. బ్యాంకెక్స్, హెల్త్కేర్, టెలికమ్యూనికేషన్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి.
మద్దతుస్థాయి 20,850
నిఫ్టీకి 20,850 పాయింట్ల వద్ద మద్దతు ఉన్నదని, ఈ స్థాయిని కోల్పోతే స్వల్పకాలిక కరెక్షన్ జరగవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు. 21,000 స్థాయిని దాటితే బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేశారు.