న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల్లో (ఏయూఎం) టాప్-10 రాష్ర్టాల వాటా 87 శాతం ఉన్నట్టు ఇక్రా అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. 2024 జనవరిలో టాప్-5 రాష్ర్టాలైన మహారాష్ట్ర, న్యూఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లు నుంచి ఫండ్స్లో మదుపరులు చేసిన పెట్టుబడులు 68.46 శాతమని, 2023 జనవరితో పోలిస్తే 69.43 శాతం నుంచి స్వల్పంగా తగ్గినట్టు ఇక్రా తెలిపింది.
పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.52.89 లక్షల కోట్లుకాగా, మహారాష్ట్ర రూ.21.69 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్రలో ఎంఎఫ్ల్లో తలసరి పెట్టుబడి రూ.1,69,300 ఉండగా, మణిపూర్లో అన్నింటికంటే కనిష్ఠంగా రూ.3,270 మాత్రమేనని ఇక్రా అనలిటిక్స్ మార్కెట్స్ డేటా హెడ్ అశ్విని కుమార్ చెప్పారు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) చిన్న నగరాలు సైతం శాఖల్ని తెరిస్తే పెట్టుబడులు పెరుగుతాయన్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో 246 ఏంఎసీ శాఖలు ఉండగా, మణిపూర్లో ఒకటి మాత్రమే ఉన్నదన్నారు.