మరో త్రైమాసికంలో రికార్డు స్థాయి విక్రయాలను కనబరిచాం. నూతన ఔషధాలను యూరప్, అమెరికా మార్కెట్లోకి విడుదల చేయడం కలిసొచ్చింది. అనుబంధ వ్యాపారాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలను వేగవంతం చేయడంతోపాటు మాలుక్యుల్స్ కోసం వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటున్నాం.
– జీవీ ప్రసాద్, డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్, ఎండీ
Reddys Lab | హైదరాబాద్, జనవరి 30: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.1,379 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,247 కోట్లతో పోలిస్తే 11 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.6,770 కోట్ల నుంచి రూ.7,215 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటం కంపెనీకి కలిసొచ్చింది. ముఖ్యంగా ఇక్కడి మార్కెట్లోకి కొత్త ఔషధాలను విడుదల చేయడంతోపాటు గత మందులకు డిమాండ్ అధికంగా ఉండటం కూడా ఆదాయం పెరగడానికి దోహదం చేసినట్లు వెల్లడించింది.