హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.110.3 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.121.40 కోట్ల లాభంతో పోలిస్తే 9 శాతం తగ్గినట్లు పేర్కొంది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 11.7 శాతం ఎగబాకి రూ.1,396.20 కోట్లకు చేరుకున్నది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు రూ.5 విలువైన ప్రతిషేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. గత త్రైమాసికంలో కొత్తగా 2,781 మంది సిబ్బందిని నియమించుకున్నది.