ముంబై, నవంబర్ 4: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,099.58 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. జూన్ త్రైమాసికంలో నమోదైన రూ.18,356 కోట్ల లాభం కంటే భారీగా తగ్గగా, ఏడాది క్రితం నమోదైన రూ.14,752 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 9.13 శాతం పెరిగింది. బ్యాంక్ ఆదాయం రూ.88,733 కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఉద్యోగుల వేతనాలతోపాటు పెన్షన్లు పెరగడంతో సంస్థపై రూ.5,900 కోట్ల భారం పడింది. దీంతో ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జించలేకపోయాం. రైటా-ఆఫ్ చేసిన రుణాల్లో రూ.1,200 కోట్లను వసూలు చేయగలిగాం. తాకట్టులేని రుణాలపై ఎలాంటి ఆందోళన లేదని, తాకట్టువున్న రుణాల కంటే ఇది ఆశాజనకంగా ఉన్నాయి. స్థూల నిరర్థక ఆస్తుల్లో వీటి వాటా కేవలం 0.69 శాతం మాత్రమే. ఇప్పట్లో డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవు.
– దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్