న్యూఢిల్లీ, ఆగస్టు 15: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు మరోసారి షాకిచ్చింది. బెంచ్మార్క్ లెండింగ్ రేటును అర శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు మరింత భారం కానున్నాయి. గడిచిన మూడు నెలల్లో వడ్డీరేట్లను పెంచడం ఇది మూడోసారి కావడం విశేషం. రిజర్వు బ్యాంక్ రెపోరేటును అర శాతం పెంచిన వారం రోజుల్లోనే ఎస్బీఐ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. అలాగే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్), రెపో-లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్) కూడా అర శాతం సవరించింది బ్యాంక్. దీంతో ఈబీఎల్ఆర్ 8.05 శాతానికి చేరుకోగా, ఆర్ఎల్ఎల్ఆర్ కూడా అరశాతం వడ్డించడంతో రేటు 7.65 శాతానికి చేరుకున్నది. ఖాతాదారుల క్రెడిట్ రిస్క్ ఆధారంగా గృహ, వాహన రుణాలపై వడ్డీరేటును నిర్ణయిస్తున్నది.
ఎంసీఎల్ఆర్ కూడా..
ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు)తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్క రోజు నుంచి మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 7.15 శాతం నుంచి 7.35 శాతానికి, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 7.45 శాతం నుంచి 7.65 శాతానికి పెరిగింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీ 7.70 శాతానికి, రెండేండ్ల రుణాలపై వడ్డీని 7.90 శాతానికి, మూడేండ్ల రుణాలపై వడ్డీని 8 శాతానికి పెంచింది. మే నెలలో ఎంసీఎల్ఆర్ని 50 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్..ఏప్రిల్ నెలలోనూ 60 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో ఇప్పటి వరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, కెనరా బ్యాంక్తోపాటు ఇతర ప్రభుత్వ బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ని వడ్డీంచాయి కూడా. మరోవైపు, గతవారంలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో ఆయా కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై వడ్డీరేటు 2.90 శాతం నుంచి 5.65 శాతం మధ్యలో ఉన్నది.