నాలుగు దశాబ్దాల క్రితం ఒక చిన్న అపార్ట్మెంట్లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ నేడు ప్రపంచంలో నలుదిశలూ వ్యాపించి, రూ.6 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది. సాఫ్ట్వేర్ సర్వీసుల రంగంలో గ్లోబల్ డెలివరీ మోడల్కు శ్రీకారం చుట్టిన కంపెనీగానే కాకుండా, అమెరికాలో టెక్నాలజీ స్టాక్ ఎక్సేంజ్ నాస్డాక్లో లిస్టయిన (1999) తొలి భారత ఐటీ సంస్థ కూడా ఇదే. కేవలం 250 డాలర్ల మూలధనంతో మొదలైన ఇన్ఫోసిస్ ఇప్పుడు ఏడాదికి 17.53 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే దిగ్గజం. కంపెనీలో 3,45,000 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ స్థాపించిన రోజుల్ని నారాయణ మూర్తి గుర్తుచేసుకుంటూ ఈ వెంచర్ను ఎందుకోసం ప్రారంభించాలా అనే అంశమై ముంబైలోని సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తాను, ఇతర సహ వ్యవస్థాపకులు చర్చించుకున్నామన్నారు.
‘వృత్తినిపుణుల కోసం, వృత్తి నిపుణులతో, వృత్తినిపుణుల కంపెనీని సృష్టించాలని మేము నిర్ణయించుకున్నాం’ అని నారాయణ మూర్తి తాజాగా జరిగిన ఇన్ఫోసిస్ ఈవెంట్లో చెప్పారు. భారత్లో అత్యున్నత పారదర్శకతతో కంపెనీని నడపవచ్చని ప్రపంచానికి చూపించాలనున్నామని మూర్తి వివరించారు. 1982లో ఏడుగురు ఇంజనీర్లు..ఎన్ఆర్ నారాయణ మూర్తి, నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, కే దినేష్, ఎస్డీ శిబులాల్, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరాలు కలిసి ఇన్ఫోసిస్ను నెలకొల్పారు. 40వ వ్యవస్థాపక దినోత్సవం రోజున వీరిలో నారాయణ మూర్తి, గోపాలకృష్ణన్, శిబులాల్, నీలకేని, దినేష్లు హాజరయ్యారు. జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు.
నారాయణ మూర్తితో 1979లో తన తొలి సమావేశాన్ని నందన్ నీలేకని గుర్తుచేసుకుంటూ ఇన్ఫోసిస్ ఇతర సహవ్యవస్థాపకులందరికీ అవకాశం ఇచ్చారన్నారు. నీలేకని మూర్తి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ ‘ఆయన ఎంతో ఆకర్షణ కలిగిన నాయకుడు, కొండ మీద నుంచి దూకేయండని ఆయన అంటే మేము అదే పనిచేసేవాళ్లం’ అన్నారు. 1979 ఫిబ్రవరిలోనే నీలేకనిలో స్పార్క్ను మూర్తి గమనించారు. ఐఐటీ బొంబే నుంచి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో పట్టాపొందిన నీలేకని ఉద్యోగం కోసం అన్వేషిస్తూ మూర్తి వద్దకు వెళ్లారు. అప్పుడు మూర్తి పత్ని కంప్యూటర్ సిస్టమ్స్లో పనిచేస్తున్నారు.
నీలకేనికి అడ్వాన్స్డ్ ప్యాట్రన్ రికగ్నిషన్లో ఒక టెస్ట్ పెట్టగా, అందులో విజయవంతమయ్యారు. ఇంటర్వ్యూలో నీలేకనిని తన ప్రణాళికలేమిటని అడిగానని, అందుకు బదులుగా యూఎస్లో బిజినెస్ స్కూల్లో చేరాలనుకుంటున్నట్టు, జీమ్యాట్కు ప్రిపేర్ అవుతున్నట్టు, సెప్టెంబర్ వరకూ ఖాళీయేనంటూ నీలేకని చెప్పారని మూర్తి తెలిపారు. ‘అది ఎంత తక్కువ సమయమైనా కానివ్వు. నీతో ఒక తెలివైన వ్యక్తి తోడుండటం మంచిది’ అని నీలకేనికి చెప్పానని మూర్తి తెలిపారు. అంతే..ఇన్ఫోసిస్ను నెలకొల్పుదామన్న ఐడియాను చెప్పగానే ఇతర సహ వ్యవస్థాపకులు కూడా జై కొట్టారు.