Gold Smuggling | భారత్ లోకి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న శ్రీలంక పౌరుడ్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న బంగారం విలువ రూ.55 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు మంగళవారం తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి విచారించినప్పుడు తాను ఆదివారం నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయన లగేజీని నిశితంగా తనిఖీ చేసినప్పుడు 860.38 గ్రాముల బంగారం బయట పడింది. దీని విలువ రూ.55 లక్షలు ఉంటుందని కస్టమ్స్ విభాగం తెలిపింది. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.