చరాస్తుల విలువ తగ్గింపు దెబ్బ
ఆదాయం రూ.5,437 కోట్లు
హైదరాబాద్, మే 19 (బిజినెస్ బ్యూరో): కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన కారణంగా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబ్ నికరలాభం భారీగా క్షీణించింది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు తగ్గింది. నిరుడు ఇదేకాలంలో ఈ లాభం రూ. 362.4 కోట్లు. తాజా త్రైమాసికంలో రూ. 510 కోట్ల నికరలాభాన్ని ఆర్జించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన మేరకు ఇంపైర్మెంట్ ఛార్జీలను భరించినందున లాభం తగ్గిందని కంపెనీ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ గురువారం మీడియాకు తెలిపారు. టెపిలమైడ్ ఫుమరేట్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ల మార్కెట్ అవకాశాలు తగ్గినందున రూ.430 కోట్లు, అమెరికాలోని ష్రెవెపోర్ట్ ప్లాంట్ ఆస్తులు, గుడ్విల్కు రూ.310 కోట్లు..మొత్తం రూ. 760 కోట్ల ఇంపైర్మెంట్ ఛార్జీలను కంపెనీ ఖాతాల్లో చూపించింది.
ఫలితాల వివరాలు:
జూలైకల్లా డీసీజీఐ చెంతకు స్పుత్నిక్ లైట్
కొవిడ్ బూస్టర్ డోస్ స్పుత్నిక్లైట్ వ్యాక్సిన్కు జూన్ చివరినాటికి లేదా జూలై తొలినాళ్లలో రెగ్యులేటర్ అనుమతి కోసం వెళతామన్న ఆశాభావాన్ని డాక్టర్ రెడ్డీస్ వ్యక్తం చేసింది. కంపెనీ సీఈవో దీపక్ సప్రా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి 12-17 సంవత్సరాల పిల్లల కోసం ఉద్దేశించిన స్పుత్నిక్-ఎం వ్యాక్సిన్ను నిలిపివేశామని, స్పుత్నిక్ లైట్పై దృష్టినిలిపామని, దీని ధరను నిర్ణయించాల్సి ఉందన్నారు. ఏ ఇతర వ్యాక్సిన్ తీసుకున్నవారైనా బూస్టర్డోస్గా స్పుత్నిక్ లైట్ టీకాను వేసుకోవచ్చని, ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయని, అటుతర్వాత రెగ్యులేటర్ డ్రగ్గ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సంప్రదిస్తామన్నారు. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వాడకానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో డీసీజీఐ అనుమతించింది. ఇండియాలో ఇప్పటివరకూ 12 లక్షల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ టీకాలను విక్రయించినట్టు ఆయన తెలిపారు.