బోధన్ 18వ వార్డు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ లత
బరిలో నిలిచిన ఒక అభ్యర్థితో పాటు మున్సిపల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్
బోధన్, మే 2: బోధన్ మున్సిపాలిటీలోని 18వ వార్డుకు జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్లో సోమవారం జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. సోమవారం నిర్వహించే ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నిర్వహించిన పోలింగ్లో 1,199 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు కొంతమంది ఓటర్లు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో రౌండ్లో రెండు టేబుళ్లు ఏర్పాటుచేశారు. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. ఒక్కో టేబుల్కు ఒక్కో అభ్యర్థి తరఫున ఒక్కో కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. కౌంటింగ్ సిబ్బందితోపాటు మున్సిపల్ ఉద్యోగులు కూడా కౌంటింగ్కు సంబంధించిన విధుల్లో పాల్గొంటారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ను ధరించాల్సి ఉంటుంది. కౌంటింగ్లో కర్రోళ్ల గంగారాం అలియాస్ బెంజర్ గంగారాం (టీఆర్ఎస్), ప్రమోద్ అలియాస్ చిత్రాల చిన్నా (కాంగ్రెస్), మదారి పద్మ (ఎంఐఎం), దండు పెద్ద లాలయ్య (బీజేపీ) భవితవ్యం తేలనున్నది.
బీజేపీ అభ్యర్థి, మున్సిపల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్..
బోధన్ 18వ వార్డు అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది, వారికి సహాయపడే మున్సిపల్ సిబ్బందికి ఆదివారం బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 70 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో 18వ వార్డు బీజేపీ అభ్యర్థి దండు పెద్ద లాలయ్యకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మున్సిపల్ ఉద్యోగి రవీందర్ కూడా కొవిడ్ బారినపడ్డారు. పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినవారిని మాత్రమే సోమవారం నిర్వహించే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ లత..
బోధన్లో సోమవారం నిర్వహించే 18వ వార్డు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ లత ఆదివారం పరిశీలించారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె ఎన్నికల, మున్సిపల్ అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రతిఒక్కరూ మాస్క్ ధరించేలా చూడాలని ఆమె అన్నారు. శానిటైజర్లు ఉపయోగించాలని, అలాగే కౌంటింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా లేకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.