SpiceJet Violation | ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ విమానం ఒకటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) నుంచి క్లియరెన్స్ లేకుండానే టేకాఫ్ తీసుకున్నది.గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో గురువారం (2021, డిసెంబర్ 30)న ఈ ఘటన చోటు చేసుకున్నది. దీనిపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆ సంస్థ అధికారులు ఆదివారం తెలిపారు.
డిసెంబర్ 30 ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రాజ్కోట్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో మధ్యాహ్నం 11.15 గంటలకు ల్యాండయింది. రాజ్కోట్ విమాన పైలట్ల వ్యవహారశైలిపై డీజీసీఏ విచారణ పెండింగ్లో ఉందని స్పైస్జెట్ అధికార ప్రతినిధి తెలిపారు.
విమానాశ్రయం నుంచి ఒక విమానం టేకాఫ్ కావడానికి ముందు ఏటీసీ నుంచి పలు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఎయిర్ క్రాప్ట్ నుంచి రన్వేకు రావడానికి పర్మిషన్ తీసుకోవాలి. అక్కడి నుంచి టేకాఫ్ తీసుకోవడానికి ఏటీసీ నుంచి అనుమతులు తీసుకోవాలి. టేకాఫ్కు ముందు కూడా ఏటీసీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ డిసెంబర్ 30న స్పైస్జెట్ విమానం పైలట్లు అనుమతులు తీసుకోలేదని ఏటీసీ అధికారులు తెలిపారు.