న్యూఢిల్లీ, మార్చి 8: మరోసారి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఈ ఏడాది మే 20న స్పెక్ట్రమ్ యాక్షన్ మొదలవబోతున్నది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికం శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే స్పెక్ట్రమ్ వేలంలో కేంద్ర ప్రభుత్వం 8 శ్రేణుల్లోని రేడియో తరంగాలను అమ్మకానికి పెడుతున్నది. మొబైల్ ఫోన్ సేవల కోసం ఈ స్పెక్ట్రమ్ వేలం జరుగుతుండగా, కనీస ధరను రూ.96,317.65 కోట్లుగా నిర్ణయించారు.
కాగా, దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీలకు చెందిన స్పెక్ట్రమ్తోపాటు ఈ ఏడాదితో కాలపరిమితి ముగియనున్న స్పెక్ట్రమ్ను కూడా మళ్లీ కొత్తగా వేలం వేయనున్నారు. 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెట్జ్లతోపాటు 26 గిగాహెట్జ్ బ్యాండ్లలో అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ను వేలానికి తెస్తున్నారు. ఈ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనే సంస్థలు ఏప్రిల్ 22లోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మే 9న బిడ్డర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.