ఆర్థిక స్వావలంబనను సాధించిన మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంట్లోనూ.. బయటా ఆర్థికపరమైన నిర్ణయాల్లో వారిదే పైచేయి. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక నిర్ణయాల్లో వారి పాత్ర వస్తున్నది. ఈ ట్రెండ్ను గుర్తించిన బీమా కంపెనీలు వారినే దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. బీమా రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) వార్షిక నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 93 లక్షల మంది మహిళలు కొత్తగా బీమా పాలసీలు తీసుకున్నారు. ఇది మొత్తం పాలసీల్లో 33 శాతం. 2019-20 కన్నా ఒక శాతం ఎక్కువ.
ఎల్ఐసీ కూడా ధనరేఖ అనే పాలసీని గృహిణుల కోసమే ఇటీవల ప్రవేశపెట్టింది. ఇది వ్యక్తిగత సేవింగ్స్ ప్లాన్. అలాగే చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కలిసి చోళ శక్తి పాలసీని ప్రవేశపెట్టింది. ఇది గృహిణులను ఉద్దేశించి ప్రవేశపెట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీలో కాన్పులు, పర్సనల్ యాక్సిడెంట్, ఆరోగ్య సమస్యలు, పిల్లల విద్య వంటివి కవర్ అవుతాయి.
మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడంతోపాటు అక్షరాస్యతనూ పెంచుకున్నారు. దీంతో కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లోవారి పాత్ర బాగా పెరిగింది. వారి కోసం ప్రత్యేకంగా బీమా పాలసీని తీసుకోవడం మంచిదే. అన్ని ప్రముఖ బీమా కంపెనీలు గృహిణులే లక్ష్యంగా పాలసీలను కూడా ప్రవేశపెడుతున్నాయి.
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. గృహిణుల కోసం స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం సంపాదిస్తున్న భర్తల పాలసీకి యాడ్ఆన్గా టర్మ్ కవర్ను మాత్రమే బీమా కంపెనీలు అందిస్తున్నాయి. ఇంటిని నిర్వహించడంలో గృహిణుల పాత్ర చెరగనిది. మొత్తం కుటంబం సంరక్షణ అందించడంతోపాటు ఎమోషనల్ సపోర్ట్ కల్పించడం ఉద్దేశంతో ఈ పాలసీని ప్రవేశపెట్టింది. అలాగే కుటుంబంలో ఆర్థిక స్వావలంభనను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ పాలసీని ప్రవేశపెట్టినట్టు మ్యాక్స్ లైఫ్ తెలిపింది. ప్రస్తుత కష్టకాలంలో ఈ పాలసీ గృహిణులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ఈ పాలసీని పాలసీ బజార్ డాట్కామ్లో కొనుగోలు చేయవచ్చు.