హైదరాబాద్, అక్టోబర్ 30: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ మరో 27.5 మిలియన్ డాలర్లు(రూ.225 కోట్ల) నిధులు సమీకరించింది. ప్రీ-సీరిస్ సీ ఫండింగ్లో భాగంగా సింగపూర్కు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టెమాసెక్ నుంచి ఈ నిధులను సేకరించింది. ఈ నిధులను భవిష్యత్తు వ్యాపార నిమిత్తం వినియోగించనున్నట్టు, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీని ఆధునీకరించడానికి, ప్రతిభ కలిగిన సిబ్బందిని నియమించుకోవడానికి, ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వినియోగించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
2022లో సంస్థ 95 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించిన విషయం తెలిసిందే. అలాగే నవంబర్ 2022లో తన తొలి రాకెట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన సంస్థ..తన రెండో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్, సీవోవో భరత్ మాట్లాడుతూ..అంతర్జాతీయ పెట్టుబడిదారైన టెమాసెక్ తమ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నదని, ఈ నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకు, ఆర్అండ్డీ, సిబ్బంది సంఖ్యను పెంచుకోవడానికి వినియోగించనున్నట్టు చెప్పారు.