న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారత్లో ద్రవ్యోల్బణం తగ్గదని, రిజర్వ్బ్యాంక్ గరిష్ఠనిర్దేశితస్థాయి అయిన 6 శాతంపైనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. సోమవారం సంస్థ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ అవుట్లుక్ విడుదల చేసింది. ఈ ఏడాది సగటు ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గవచ్చని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. 2022 క్యాలండర్ సంవత్సరం ముగిసేవరకూ వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) రిజర్వ్బ్యాంక్ సహనస్థాయి అయిన 6 శాతంపైనే కొనసాగుతుందని పేర్కొంది. గోధుమ, బియ్యం ధరల పెరుగుదలతో ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందని పేర్కొంది. టోకు ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో సైతం అధికస్థాయిలో 12.41 శాతంగా నమోదయ్యింది.
5.90 శాతానికి ఆర్బీఐ వడ్డీ రేటు
ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగుతున్నందున రిజర్వ్బ్యాంక్ పాలసీ వడ్డీ రేట్లు మరింత ఎగిసిపోతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరించింది. ఈ సంవత్సరాంతానికి రెపో రేటు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. ఈ సెప్టెంబర్ 30 నాటి ద్రవ్య విధాన సమీక్షలో 50 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ రేట్లను పెంచుతుందని, దీంతో ఇది మూడేండ్ల గరిష్ఠస్థాయి 5.90 శాతానికి చేరుతుందన్నది.
మా వృద్ధి అంచనాలూ తగ్గొచ్చు
అధిక అంతర్జాతీయ వడ్డీ రేట్లతో డాలర్ పెట్టుబడులు తరలిపోయి, ప్రాంతీయ కరెన్సీ విలువ తరిగిపోయి ఈ ప్రాంతపు కేంద్ర బ్యాంకులను ఒత్తిడి పెడతాయని ఎస్ అండ్ పీ వివరించింది. భారత్లో సర్వీసు రంగం కోలుకుంటుందని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి 7.3 శాతంగా ఉంటుందని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం మేర వృద్ధి సాధించవచ్చని అంచనా వేసింది. అయితే తమ అంచనాలకంటే వృద్ధి రేటు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని ఎస్ అండ్ పీ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ లూయిస్ కుజిస్ చెప్పారు. ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్, సిటీగ్రూప్ తదితర అంతర్జాతీయ సంస్థలు భారత్ వృద్ధి రేటును ఇప్పటికే 7 శాతం లేదా అంతకంటే దిగువకు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి రేటును ఆర్బీఐ అంచనా వేస్తుండగా, ఏడీబీ, ఫిచ్లు 7 శాతంగా అంచనా వేస్తున్నాయి.
ఒడిదుడుకుల్లోనే రూపాయి
రానున్న రోజుల్లో కూడా రూపాయి విలువ ఒడిదుడుకులకు లోనవుతుందని ఎస్ అండ్ పీ ఎకానమిస్ట్ విష్రూత్ రాణా తెలిపారు. యూఎస్ ఫెడ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసినందున విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలివెళతాయని, దీంతో డాలర్ బలం పుంజుకుంటుందని, ఇతర దేశాల కరెన్సీల విలువ పడిపోతుందని ఆయన వివరించారు. తాజాగా రూపాయి 81.67 స్థాయికి పతనమయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకూ డాలరు మారకంలో రూపాయి విలువ 9.4 శాతం క్షీణించింది. గత నెలరోజులుగా ఇతర అంతర్జాతీయ కరెన్సీలకంటే రూపాయి తక్కువగా తగ్గిందని, అయితే గ్లోబల్ కేంద్ర బ్యాంక్ల విధానాలు మరింత కఠినతరం కానున్నందున కరెన్సీ ఒడిదుడుకులు కొనసాగుతాయని రాణా హెచ్చరించారు.