Sovereign Gold Bond | ముంబై, ఫిబ్రవరి 10: తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలులో ఉంటుంది. చివరకు ఈ నెల 16న ముగుస్తుంది. ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించే మూడు రోజుల బంగారం సగటు ధర (ఇష్యూకు ముందు మూడు పనిదినాల ముగింపు ధర) ఆధారంగా గోల్డ్ బాండ్లకు ధర నిర్ణయిస్తారు. బాండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపే మదుపుదారులకు నిర్ణీత ధరకంటే గ్రాముకు రూ.50 చొప్పున కేంద్ర ప్రభుత్వం డిస్కౌంట్ ఇస్తుంది. అంటే వారికి గోల్డ్ బాండ్ రూ.6,213 ధరకు లభిస్తుందని ఆర్బీఐ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్లు, ఎంపికచేసిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, బొంబే స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా ఈ బాండ్లను ఆర్బీఐ విక్రయిస్తుంది.