Sovereign Gold Bond | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం.. దేశీయ అవసరాల కోసం పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దీనికి తోడు రోజురోజుకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో మంచి రిటర్న్స్ కోసం ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ను కేంద్రం తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడుత సావరిన్ గోల్డ్ బాండ్లను ఈ నెల 18 నుంచి 22 వరకూ జారీ చేయనున్నది. ఈ బాండ్ల విలువను ఆర్బీఐ శుక్రవారం ఖరారు చేసింది. గ్రామ్ బంగారం బాండ్ విలువను రూ.6,199గా నిర్ణయించింది. సావరిన్ గోల్డ్ బాండ్ల జారీకి మూడు రోజుల ముందు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) నిర్ధారించిన 24 క్యారెట్స్ బంగారం తులం సరాసరి విలువ ఆధారంగా బాండ్ (ఒక గ్రామ్) విలువను ఆర్బీఐ ఖరారు చేస్తుంది.
ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్హెచ్సీఐఎల్), క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్), గుర్తింపు పొందిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ నేపథ్యంలో 999 శాతం స్వచ్ఛత గల (24 క్యారెట్స్) బంగారం గ్రామ్ విలువ రూ.6,199గా ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సావరిన్ బాండ్లలో కనీసం ఒక గ్రామ్ విలువ గల బాండ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఆర్బీఐతో సంప్రదించిన తర్వాత ఆన్లైన్లో బాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా, డిజిటల్ పేమెంట్స్ ద్వారా బాండ్లు కొనుగోలు చేసినా ఒక గ్రామ్ బంగారంపై రూ.50 రాయితీ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నాలుగు కిలోల విలువ గల బాండ్లను కొనుగోలు చేయొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) నాలుగు కిలోలు, ట్రస్ట్లు- ట్రస్ట్ తరహా సంస్థలు 20 కిలోల విలువ గల బాండ్లు కొనుగోలు చేయవచ్చు. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు ఎనిమిదేండ్ల తర్వాత మెచ్యూర్ అవుతాయి. ఐదేండ్ల తర్వాత రిడింప్షన్ చేసుకుంటే అదే తేదీన అమల్లో ఉన్న వడ్డీ ప్రకారం చెల్లిస్తారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను ఆర్బీఐ విడుదల చేస్తుంది. ఈ బాండ్లను కొల్లెటరల్ రుణాలు తీసుకునేందుకు వాడొచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసినట్లే సావరిన్ గోల్డ్ బాండ్ల కొనుగోలుకు కూడా `కేవైసీ` పత్రాలు సమర్పించాలి. 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ సావరిన్ గోల్డ్ బాండ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఫిజికల్ గోల్డ్కు గిరాకీ తగ్గించి, పొదుపు దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి కేంద్రం ఈ స్కీమ్ అమలు చేస్తున్నది. గోల్డ్ బాండ్ల కొనుగోలు ద్వారా ఫైనాన్సియల్ సేవింగ్స్ను ప్రోత్సహిస్తున్నదీ కేంద్రం.