Twitter services | ట్విట్టర్ను తన ఖాతాలో వేసుకున్న ఎలాన్ మస్క్.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బ్లూ టిక్ ఉచితం కాదని లీక్ చేసిన మస్క్.. రానున్న రోజుల్లో ఉచిత ట్విట్టర్ సేవలను ముగించనున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ట్విట్టర్ను వినియోగించే సమయాన్ని కూడా పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు సబ్స్క్రిప్షన్ ఇవ్వడంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఎలాన్ మస్క్ తీసుకోనున్న నిర్ణయం ప్రకారం ఇకపై ట్విట్టర్ సేవలు ఉచితంగా లభించవు. ట్విట్టర్ సేవలను పొందేందుకు వినియోగదారులు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఫీజులను కూడా వసూలు చేయాలని మస్క్ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన సమావేశంలో మస్క్ ఈ ఆలోచనపై ఉద్యోగులతో చర్చించినట్లు ఫాట్ఫాం నివేదిక ఒకటి పేర్కొన్నది.
మస్క్ ఆలోచన ప్రకారం వినియోగదారులు పరిమిత సమయం యాక్సెస్ను ఉచితంగా పొందుతారు. పరిమిత సమయం తర్వాత ట్వీట్ చేయాలంటే సభ్యత్వం కలిగి ఉండాలి. అయితే, ఈ నిర్ణయం అమలులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. దీనిపై మస్క్ చేస్తున్న వర్కవుట్ ఇంకా తెలియలేదు. కంపెనీ బృందం ప్రస్తుతం కొత్త వెరిఫికేషన్ సబ్స్క్రిప్షన్ ఫీచర్పై పని చేస్తున్నట్లుగా ప్లాట్ఫాం నివేదిక వెల్లడించింది.
సబ్స్క్రిప్షన్ మోడ్కు 3 కారణాలు..
కంపెనీకి నిత్యం రూ.32 కోట్ల నష్టం వస్తున్నది. కొత్త మోడల్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం
ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ పెట్టిన 44 బిలియన్ డాలర్లను త్వరగా సంపాదించడం
ట్విట్టర్కు భారీ మొత్తంలో అప్పు ఉంది. అప్పుల నుంచి బయటపడేందుకు ప్రకటనదారులపై ఆధారపడకపోవడం..
ఇప్పటివరకు సంస్థ మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఖర్చులను నివారించడం, బ్లూటిక్ కోసం 8 డాలర్లు చెల్లించడం వంటి కఠిన నిర్ణయాలను ఎలాన్ మస్క్ తీసుకున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో సూపర్ యాప్ను అందుబాటులోకి తేవడం, ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అందుబాటులోకి తేవడం, అవాంతరాలు లేకుండా భావవ్యక్తీకరణకు అవకాశం, క్రిప్టో మార్కెట్కు ప్లాట్ఫాం సిద్ధం చేయడం, చైనాలో వ్యాపారాన్ని విస్తరించడం వంటి మార్పులు తీసుకురావాలని ఎలాన్ మస్క్ అనుకుటుంన్నట్లుగా మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తున్నది.