Indian Railways | ఇక నుంచి మీరు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా వివిధ యుటిలిటీ బిల్లులు పేమెంట్ చేయొచ్చు. మీ మొబైల్ ఫోన్లు రీచార్జీ చేసుకోవచ్చు. ఆధార్ అప్డేషన్, పాన్ కార్డు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. దేశవ్యాప్తంగా సమీప భవిష్యత్లో 200 రైల్వే స్టేషన్ల వద్ద ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రానున్నాయి. ఈ వసతులను మీకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేస్.. రైల్టెల్ అనే పేరుతో కియోస్కీని ప్రారంభించింది. ప్రతిపాదిత 200 రైల్వే స్టేషన్లలో రైల్టెల్ కియోస్కీలు ఏర్పాటు చేయబోతున్నారు. వీటి ద్వారా ఆధార్, పాన్ కార్డ్ ఫామ్లను నింపి సబ్మిట్ చేయొచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) సాయంతో వివిధ పన్నులు పే చేసే వెసులుబాటు ఉంటుంది. సీఎస్సీ- ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా, కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ఈ స్కీం ప్రారంభం కానున్నది.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలిసి గ్రామాల స్థాయిలో ఈ రైల్టెల్ కియోస్కీ సేవలను ప్రారంభిస్తారు. ఇందులో అన్ని రకాల సీఎస్సీ సేవలు అందుబాటులో ఉంటాయి. రైలుతోపాటు విమానం, బస్సు టిక్కెట్ల బుకింగ్ మొదలు ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు. మొబైల్ ఫోన్ల రీచార్జి, ఎలక్ట్రిక్ బిల్లుల పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. బ్యాంకింగ్, బీమా ఇతర రంగాల సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి.
రైల్టెల్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ కియోస్కీలకు రైల్వైర్ సాథీ కియోస్క్ అని పేరు పెట్టనున్నారు. రైల్టెల్ అనుబంధ రిటైల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసే రైల్ వైర్. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని వారణాసి సిటీ ప్రయాగ్రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా సేవలు ప్రారంభించారు. ఈ తరహాలోనే దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లను ఎంపిక చేస్తారు.
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలోనూ రైల్వైర్ సాథీ కియోస్కీ సేవలు అందుబాటులోకి వస్తాయి. సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ 44, నార్త్ ఫ్రంటైర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 13, వెస్ట్రన్ రైల్వేలో 15, నార్త్రన్ రైల్వేలో 25, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 12, ఈస్ట్రన్ రైల్వేలో 13, నార్త్ ఈస్ట్రన్ జోన్లో అత్యధికంగా 56 కియోస్కీలు ఏర్పాటు చేస్తారు. వివిధ ఈ-గవర్నెన్స్ సర్వీసుల నుంచి గ్రామీణులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైల్టెల్ చైర్మన్ పునీత్ చావ్లా చెప్పారు. ఈ పరిస్థితుల్లో గ్రామీణులకు డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి తేవడానికి రైల్వైర్ సాథీ కియోస్కీ చేయూత ఇవ్వనున్నది.
దేశవ్యాప్తంగా రైల్ వైర్ పేరుతో 6090 రైల్వే స్టేషన్లలో రైల్ టైల్.. పబ్లిక్ వై-ఫై వసతులను ఇన్స్టాల్ చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని 5000 స్టేషన్లు వస్తాయి. గ్రామాలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవడానికి రైల్ టైల్ ప్రారంభించిన వై-ఫై వసతులు చేయూతనిస్తాయి.