Small Cap Returns | దేశీయ స్టాక్ మార్కెట్ల ‘బుల్’ పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లలో ఇండెక్స్లు ఆల్ టైం రికార్డులు నెలకొల్పాయి. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించిన ఈక్విటీ మార్కెట్లు దూసుకెళ్లడంలో స్మాల్ స్టాక్స్.. ‘దలాల్ స్ట్రీట్’ ఫేవరెట్లుగా అవతరించాయి. దేశీయ సూక్ష్మ ఆర్థిక పరిస్థితులపై ఆశావాహ ద్రుక్పథంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టారు. లార్జ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మెరుస్తున్నాయని ఈక్విటీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ 22 వరకు బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 13,074.96 పాయింట్లు (45.20శాతం) పుంజుకుంటే, మిడ్ క్యాప్ ఇండెక్స్ 10,568.18 పాయింట్లు (41.74 శాతం) లబ్ధి పొందాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఏడాది కాలంలో 10,266.22 పాయింట్లు (16.87) శాతం పుంజుకున్నది. ఈ నెల 20న స్మాల్ క్యాప్ ఇండెక్స్ 42,648.86 పాయింట్ల వద్ద ఆల్ టైం హైని తాకితే, మిడ్ క్యాప్ ఇండెక్స్ 36,483.16 పాయింట్ల రికార్డు గరిష్టానికి చేరుకున్నది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 71,913.07 పాయింట్లతో లైఫ్ టైం గరిష్ట స్థాయి రికార్డు నెలకొల్పింది.
రిటైల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం, దేశీయ సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు ఈక్విటీ మార్కె్ట్లలో రికార్డులు నెలకొల్పడానికి కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. బ్లూచిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ సగటున ఐదో శాతం ఉంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 10వ వంతు ఉంటుంది. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ, రైల్వే రంగ స్టాక్స్ మెరుగైన లాభాలు గడించాయని ఏయూఎం క్యాపిటల్ వెల్త్ నేషనల్ హెడ్ ముకేశ్ కొచ్చర్ తెలిపారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా తమ వాటాలను విక్రయిస్తు్న్నా.. దేశీయ సంస్థాగత రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు మదుపు చేయడంతో స్టాక్ మార్కెట్లలో కొత్త రికార్డులు నమోదయ్యాయి.
ఈ ఏడాది మార్చి 28న స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 26,120.32 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 23,356.61 పాయింట్లతో 52 వారాల కనిష్ట రికార్డు నమోదు చేశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ సైతం గత మార్చి 20న 57,084.91 పాయింట్ల ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది. 2022లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 344.42 పాయింట్లు (1.37 శాతం) పెరిగితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 530.97 పాయింట్లు (1.80శాతం) నష్టంతో ముగిసింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ గతేడాది 4.44 శాతం (2,586.92 పాయింట్లు) పుంజుకున్నది. 2021లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 7,028.65 పాయింట్లు (39.17 శాతం), స్మాల్ క్యాప్ ఇండెక్స్ 11,359.65 పాయింట్లు (62.76 శాతం) పుంజుకున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 10,502.49 పాయింట్లు (21.99 శాతం) పెరిగింది.